కోతి-వడ్రంగుల కథ
ఒకఊళ్ళో ఒక పెద్ద మఱ్ఱిచెట్టు ఉంది. ఆ చెట్టు మీద చాలా కోతులున్నాయి. చెట్టుకింద కొందరు వడ్రంగులు దూలం కోస్తున్నారు. అది సులభంగా చీలాలని రంపం బాగా ఆడాలని వారు కోసిన భాగంలో కర్రను మేకుగా చెక్కి రెండు చీలికల మధ్యన ఉంచారు. మధ్యాహ్నం కాగానే వారు అన్నం తినటానికి వెళ్ళిపోయారు. వారటు వెళ్ళగానే ఒక ముసలి కోతి చెట్టు దిగి వచ్చి దూలం మీదెక్కి కూర్చుంది. దూలం చీలికలో ఒక కాలు బయటికొక కాలు పెట్టి మేకును బలంగా లాగింది. కొంతసేపటికి ఆ కొయ్యమేకు ఊడి రెండు చీలికలు టంగున కలుసుకొన్నాయి. దూలం మధ్యలో కాలుపడి నలిగింది. అది లబలబ మొత్తుకుంటూ కొంతసేపటికి ప్రాణాలు విడిచింది.
కాబట్టి అనవసరమైన పనులకు పోరాదు, మన దారిన మనం వెళదాం రా అని అన్నది. ఆ మాటలకు దమనకుడు “కరటకా! నీకు తెలియదురా! మనం మిత్రులకు మేలు చేయాలన్నా, శత్రువులకు కీడు చేయాలన్నా రాజుగారి అండ తప్పక ఉండాలి. రాజాశ్రయం లేని బతుకు బతుకే కాదు. బతికిన నాలుగు రోజులు రాజాలాగా దర్జాగా బతకాలిరా! మంచి చెడు తెలుసుకోలేని వాడు పశువుతో సమానం కదా!” అని చెబుతూ ఉంటే కరటకుడు “చాలు చాలు నీ మాటలు ఆపేసెయ్” మనమేమన్నా ఆయన మంత్రులమా? సలహాలు చెప్పడానికి! ఇంతకు ఏం చేద్దాం అంటావ్! చెప్పు” అని అడిగింది.
అపుడు దమనకుడు “బుద్ధిగా శ్రద్ధగా చదువుకొన్నవాడు ప్రయోజకుడౌతాడు, అట్టి వాణ్ణి రాజు గౌరవిస్తాడు. ఆ గౌరవంతో రాజ్యతంత్రాలు తెలుసుకోవచ్చు. క్రమక్రమంగా ప్రధాని కూడా కావచ్చు. కాబట్టి నేనిప్పుడే పోయి అతని భయం తీర్చి మన్నన పొంది వస్తాను. నేను వచ్చేదాకా నీవిక్కడే కూర్చో, వెంటనే వస్తాను” అని చెప్పింది. అపుడు కరటకుడు సరే వెళ్లిరా, నీకు జయం కలుగుతుంది అని అన్నది.
దమనకుడు సింహం వద్దకు వెళ్లి నమస్కారం చేశాడు. పింగళకుడు “దమనకా! క్షేమంగా ఉన్నావా? ఏం పని మీద వచ్చావు?” అనిఅడిగింది. అపుడు దమనకుడు “ప్రభూ! తమ దయవల్ల నేను క్షేమంగానే ఉన్నాను. అలా వెళ్తూ తమరేదో భయభ్రాంతులుగా ఉండి విచారిస్తూ ఉంటే కనుక్కొని వెళదామని వచ్చాను. తమ వంటి పరాక్రమవంతులను భయపెట్టినవిషయమేమిటో సెలవివ్వండి” అని అన్నది. అపుడు పింగళకుడు దమనకునితో “ఏం లేదోయ్! దప్పిక అయింది, ఆ మడుగు వద్ద నీళ్ళు తాగుదామని బయలుదేరాను. పిడుగు పాటుగా ఏదో శబ్దం వినిపించింది. నీవు కూడా వినే ఉంటావు. ఇంతకు ముందే అడవంతా దద్దరిల్లేలా, జంతువుల గుండెలు పగిలే విధంగా ఒక అరుపు వినిపించింది. దాన్ని గురించే ఆలోచిస్తున్నాను” అని అన్నాడు.
“అదా సంగతి, ప్రభూ! నేనిప్పుడే వెళ్లి ఆ శబ్దం చేసిందెవరో చూచి వచ్చి తమకు విన్నవిస్తాను. “పిట్ట కొంచెం-కూత ఘనం” అంటారు గదా! చిన్న జంతువుకైనా పెద్ద నోరు ఉండవచ్చు. అదేదో పెద్ద జంతువైతే మృగాలన్నీ పరిగెత్తి తమ వద్దకు వచ్చేవి కదా! చప్పుడు విని భయపడినా, నిదానించి నిజానిజాలు తెలుసుకోగల్గటం బుద్ధిమంతుల లక్షణం గదా! మీకొక కథ చెపుతాను వినండి” అని దమనకుడు ఈ కింది కథ చెప్పడం ప్రారంభించాడు.
